నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు.
రాజకీయ రంగ ప్రవేశం
1978లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేది. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులతో నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.
రాజకీయ ప్రవేశానికి తొలి అడుగు
1981లో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు ఊటీలో జరుగుతోంది. విరామ సమయంలో ఒక విలేకరి ఎన్ఠీఆర్ తో మాట్లాడుతూ.. మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా. మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? అని అడిగాడు. దానికి జవాబుగా ” నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తర్వాత పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగు ప్రజల సేవకోసం కేటాయిస్తాను” అని చెప్పారు. ఎన్ఠీఆర్ రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.
అప్పటి నుంచి ఎన్టీఆర్ తాను నటించాల్సిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేశారు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఎన్ఠీఆర్ కు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రం కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించారు.
అప్పటి నుంచి చైతన్య రథాలు వచ్చాయి
పార్టీ ప్రచారానికై తన పాత చెవర్లెట్ వ్యానును బాగు చేయించారు. దాన్ని ఓ కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే ఆయన ప్రసంగాలు చేసేది. దానికి “చైతన్యరథం” అని పేరు పెట్టారు. ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం రాయించారు. ఆ తర్వాత భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి.
సేకరణ : rk chinnam fb wall