ఏపీలో పీఆర్సీ జీవో మంటలు రేపుతోంది. ప్రభుత్వం తన వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. వలంటీర్ల ద్వారా ప్రతీ కుటుంబానికీ సమాచారాన్ని చేరవేస్తోంది. సంక్షేమానికే నిధులు చాలని స్థితిలో కొత్త పీఆర్సీతో జీతాలు పెంచుతున్నా వీళ్లకు తృప్తి లేదంటూ నైతికంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థయిర్యంపై వేటేస్తోంది. మరోవైపున పీఆర్సీ అనేది ఎవరో దయతో వేసే భిక్ష కాదు. అది తాము ఎన్నో పోరాటాలతో సాధించుకున్న హక్కు. దాన్ని ఓ ప్రభుత్వ పథకంలా ప్రకటించడమేంటని ఉద్యోగులు కన్నెర్రజేస్తున్నారు. సమ్మెకు నోటీసులిచ్చారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 36 ఏళ్ల నాటి చరిత్ర మళ్లీ కళ్లెదుట ప్రత్యక్షమవుతుందనిపిస్తోంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాగే పీఆర్సీ విషయమై 53 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు. చివరకు ఎన్టీఆరే దిగిరావాల్సి వచ్చింది. 1986 జులైలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పటి పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. మూడు అంశాలపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్త పీఆర్సీని ఆ ఏడాది జులై నుంచి కాకుండా జనవరి నుంచి అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. మినిమం బేసిక్ పేను రూ.740 నుంచి రూ. 750 కు పెంచాలన్నారు. అంటే కేవలం పది రూపాయలు పెంచాలని అడిగారు. అప్పటివరకూ ఇచ్చిన ఇంటీరియం రిలీఫ్ ను బేసిక్ పేలో కలపాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
రాష్ట్ర చరిత్రలో 53 రోజుల పాటు సుధీర్ఘ సమ్మె
ఎన్టీఆర్ ససేమిరా అన్నారు. ఆనాటి రాష్ట్ర ఆదాయంలో 48శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతున్నట్లు తేల్చారు. ఇక పెంచే అవకాశమే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. అంతేకాదు. అన్ని దినపత్రికల్లో ఇదే విషయంతో పూర్తి పేజీ ప్రకటనలను సైతం ఇచ్చారు. దీంతో ఉద్యోగులు1986 నవంబరు 5 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. స్కూళ్లు మూతపడ్డాయి. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేయలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కూడా అందలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పాలన దాదాపు స్తంభించింది.
ఇప్పటిలాగే కమిటీ వేసినా..
సమ్మె ప్రారంభమైన కొద్ది రోజులకు ఎన్టీఆర్ కాస్త దిగివచ్చారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఓ కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారు. ప్రభుత్వోద్యోగులు దాన్ని తోసిపుచ్చారు. సీఎంతో తప్పితే ఇతరులతో తాము చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సమ్మెను ఇంకా ఉధృతం చేశారు. పరిస్థితులు ప్రభుత్వం చేజారి పోయే విధంగా తయారవడంతో ఎన్టీఆర్ రాజదండం బయటకు తీశారు.
జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టులు..
ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తన అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నిర్వాహకులైన పన్నెండు మంది నాయకులను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయించారు. దీంతో పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారయింది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో రెచ్చిపోయారు. రాస్తారోకోలు, రాష్ట్ర బంద్ నిర్వహించారు. శాంతిభద్రతలు కూడా భగ్నమయ్యే వాతావరణం నెలకొంది. ఉద్యోగులందర్నీ తొలగిస్తామని ఎన్టీఆర్ హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు. ఉద్యోగులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
సుకుమల్ సేన్ మధ్యవర్తిత్వంతో పరిష్కారం..
ఈ దశలో ఎన్టీఆర్ కు కొండంత అండగా సుకుమల్ సేన్ నిలిచాడు. వామపక్ష పార్టీ ఎంపీ, అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు అయిన సుకుమల్ సేన్ రంగంలోకి దిగారు. .ఎన్టీఆర్ కు, ప్రభుత్వోద్యోగులకు మధ్య రాయబారం నెరిపారు. సామరస్యపూరిత వాతావరణం నెలకొల్పారు. అటు ఎన్టీఆర్, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన నచ్చజెప్పారు. సుకుమల్ సేన్ మధ్యవర్తిత్వం ఫలించి యాభై మూడు రోజుల ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు శుభం కార్డు పడింది. అంతిమ విజయం ప్రభుత్వ ఉద్యోగులదే కావడం గమనార్హం.
– ఏ. వెంకట నాగేశ్వరరావు
చైర్మన్, ఏపీ గవర్నమెంటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ