తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర చేశారంటూ ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. అంతకుముందు ఢిల్లీలో కొందరు మహబూబ్ నగర్ వాసులు కిడ్నాప్ అయ్యారనే వార్త సంచలన రేపింది. తీరా చూస్తే వాళ్లను కిడ్నాప్ చేసింది తెలంగాణ పోలీసులను తేలింది. ఢిల్లీలో కిడ్నాప్ అయినవారంతా మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు స్కెచ్ వేశారని తెలిసింది.
ఈకేసుకు సంబంధించి పోలీసులు రెండు తుపాకులు సీజ్ చేసి 8మందిని అరెస్ట్ చేశారు. బీజేపీ నేతలే మంత్రి మర్డర్కు కుట్ర చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తమకేం సంబంధం లేదని కమలనాథులు వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకీ, శ్రీనివాస్గౌడ్ను ఎందుకు చంపాలనుకున్నారు? ఏకంగా 15 కోట్లు సుపారీ ఇచ్చయినాసరే మంత్రిని చంపించాలని చూశారంటే.. అంత పగ ఎందుకు? ఇది రాజకీయ రచ్చా? వ్యాపార వైరమా?
ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు రాఘవేంద్రరాజు సంచలన విషయాలు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ను తామెందుకు చంపాలని చూశామో చెప్పాడు. ఆ వివరాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. తన వ్యాపారాలు దెబ్బతీసి, ఆర్థికంగా తనకు నష్టం చేకూర్చాడని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని రాఘవేంద్రరాజు వెల్లడించాడు.
అక్రమంగా కేసులు నమోదు చేయించడంతో పాటు తన స్థిరాస్తి వ్యాపారాన్ని శ్రీనివాస్గౌడ్ దారుణంగా దెబ్బతీశాడని ఆరోపించాడు. తనకు రావాల్సిన నగదు రాకుండా అడ్డుకున్నాడని.. తన బార్ను మూసివేయించారని తెలిపాడు.
రాఘవేంద్రరాజు ఇంకా ఏం చెప్పాడంటే.. అక్రమంగా ఎక్సైజ్ కేసులు నమోదు చేయించారని.. తన ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని కూడా మంత్రి రద్దు చేయించడాని ఆక్రోషం వ్యక్తం చేశాడు. తనను సుమారు 6 కోట్ల మేర ఆర్థికంగా దెబ్బతీశాడని.. అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు.. తనను అంతలా వేధించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యానని నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పూర్తి స్థాయి పోలీస్ కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.