తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఏదో ఒకసారి తిరుప్పోనకం తినే ఉంటారు. తిరుప్పోనకం అంటే ఏదో కాదండి. నెయ్యితో చేసిన పొంగలి ప్రసాదమే. ఈ నేతి పొంగలికి చాలా చరిత్రే ఉంది. శాసనాల్లో లభించిన సమాచారం ప్రకారం.. అసలు తిరుమల ఆలయంలో స్వామికి నివేదిస్తున్న నేతి పొంగలి ఈనాటిది కాదు. వందల ఏళ్ల క్రితం నుంచే స్వామి వారికి నేతి పొంగలిని నైవేధ్యంగా పెడుతున్నారు.
విజయనగర రాజుల కాలం నుంచి శ్రీవారి ఆలయంలో తిరుప్పోనకం సమర్పించడం పెరుగుతూ వచ్చింది. విజయ నగర రాజుల కాలంలో అనేక దేవాలయాలు పునరుద్ధరణ జరిగింది. కొత్తగా ఆలయాలు కట్టించారు. శ్రీవారి ఆలయంలో దీపాలకు బదులు నైవేథ్యాలు పెరిగాయి. స్వామివారి ముందు అన్నప్రసాదాలను కొండగా పోసి సమర్పించేవారు.
ఇప్పుడు గురువారం మాత్రమే అలాంటి సేవ (తిరుప్పావడసేవ) నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రోజూ ఇదే విధంగా నైవేద్యం పెడుతున్నారు గానీ ఒకప్పుడు రోజులో సేవ సేవకూ మధ్యలో అన్నప్రసాదాలను స్వామివారి సన్నిధిలో పర్వతంలా పోగు చేసి నైవేథ్యంగా సమర్పించేవారట. దీన్ని సంధి పూజ అని పిలిచేవారు.
ఈ పూజలు రాజుల పేరుతో.. దాతల పేరుతో జరుగుతుండేవి. బుక్కరాయసంధి, గంగడోపాలుని సంధి, నరసింహరాయ సంధి, రాయల్ సంధి ఇలా అనేక పూజలు రోజూ నిర్వహించేవారట. అప్పుడు అన్నప్రసాదం స్వామికి నివేదించేవారట.
శ్రీవారి ఆలయంలో బుక్కరాయ సంధి తొలుత ఏర్పాటు చేశారట. ఈ సంధి పూజలో నెయ్యి పొంగలి అంటే బియ్యం, పెసరపప్పు, నెయ్యితో చేసే ప్రసాదం. దీన్నే తిరుప్పోనకం అంటారు. ఈ సంధి పూజ కోసం బుక్కరాయలు ఒక గ్రామాన్ని సర్వమాన్యంగా స్వామివారికి సమర్పించారట.
రెండో దేవరాయలు వేంకటేశ్వరస్వామికి క్రీ.శ.1429 డిసెంబరులో 1200 పాన్ బంగారు నాణేలు, 2,200 వరహాల నాణేలు సంధి నైవేద్యం ఏర్పాటు చేశారు. రాయల్ సంధి పేరుతో జరిగే నైవేద్యంలో రోజూ 30 గంగాళాల అన్నప్రసాదాలు, ఒక గంగాళం పాయసం స్వామివారికి నైవేద్యంగా సమర్పించేవారట.
క్రీ.శ.1446 పెద్దజియ్యర్ మఠానికి చెందిన కోవిల్ కెల్వి ఎంబేరుమన్నార్ జియ్యర్ స్వామి రెండు తిరుప్పోనకల్ ప్రసాదాలను స్వామివారికి నైవేథ్యంగా చేసేవారట. సంధిపూజ నైవేద్యాలలో గృహస్తు భాగంగా వచ్చే వాటాను అప్పుడు తిరుమల ఉచిత భోజనశాలకు తరలించి పంచిపెట్టేవారట. అదండీ సంగతి. చూశారా.. తిరుప్పోనకం వెనుక ఎంత చరిత్ర ఉందో !
సేకరణ : RK Chinnam FB wall నుంచి