తెలంగాణలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీ వికసించడంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. ఆ పార్టీలో మళ్లీ వలసలు జోరందుకునేలా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న పలువురు నేతలు కమలం వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరడానికి దాదాపుగా రంగం సిద్ధమైందని చెబుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంతనాలు జరిపారు. పార్టీలో ప్రాధాన్యత దక్కని నేతలంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భేటీ కావడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా లేదా ఏ పార్టీ నుంచైనా అభ్యర్థిగా బరిలో నిలిస్తే తుమ్మల నాగేశ్వరరావు వెంటే తమ పయనమని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో తమను కలుపుకొని పోవటం లేదంటూ వాపోయారు. ఖమ్మంలో పాలేరు నేతలు నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు.
ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి హరీశ్ రావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమై చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తుమ్మలతో మంత్రి హరీశ్ రావు చర్చలు జరిపినట్టు సమాచారం.
గత కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లాకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపారు. పార్టీలో ప్రాధాన్యత లేక ఇబ్బంది పడుతున్న నేతలు కావడంతో..ముగ్గురు సీనియర్ నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా ఖమ్మంలో తుమ్మల వర్గీయులు సమావేశం కావడంతో పార్టీ మార్పు అంశం మళ్లీ జోరందుకుంది. యూపీతో పాటు మూడు రాష్ట్రాల్లో బీజేపీ గ్రాండ్ వికర్టీ సాధించడంతో..గులాబీ తోటలో ఉన్న అసంతృప్తి నేతలు కాషాయ దళం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల అదే బాటలో పయనించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.