తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ఈ ప్లాన్ వేసుండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి నాటకాలకు తెర తీశారని ఎద్దేవా చేశారు. పీకే సూచనలతో కొత్త డ్రామాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు.
తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. మరో 12 నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు.
అయితే ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై జోరుగా చర్చ జరుగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని కొందరు బీజేపీ నేతలు కామెంట్ చేశారు. పీకే డ్రామాలో ఇదో స్క్రిప్ట్ అని సోషల్ మీడియోలో చర్చ జరిగింది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా అవే కామెంట్లు చేయడం ఆసక్తిగా మారింది.