కర్ణాటక రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన హిజాబ్ కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది.
‘‘ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదు. పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే. దీనికి విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’’ అని ధర్మాసనం వెల్లడించింది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్ అని, దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది.
కర్ణాటక హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10వతేదీన హిజాబ్ పిటిషన్లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వతేదీన తీర్పును రిజర్వ్ చేసింది. పాఠశాల, కళాశాల క్యాంపస్లలో హిజాబ్ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది .దీనిపై ఉడిపిలోని బాలికల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు సమర్పించారు.
కౌంటర్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని వాదించింది. దీంతో కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని పిటిషనర్లు చెప్పారు.