ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటూ జనసేనాని చేసిన ప్రకటన చుట్టే ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. విపక్షాలన్ని మహా కూటమిగా ఏర్పాడతాయనే సంకేతాలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రసంగం జనసైనికుల్లో జోష్ నింపితే.. రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులకు మాత్రం చాలా ప్రశ్నలను మిగిల్చింది.
ఇక ఏపీ ప్రభుత్వం బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ తనకు రోడ్డు మ్యాప్ ఇస్తానని చెప్పిందని.. దాని కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం అని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పవన్ , బీజేపీ, టీడీపీ కలిసి మళ్లీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు పవన్ తన స్పిచ్ లో ఇచ్చారు.
దీంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. కొంత కాలంగా జనసేనతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో పవన్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు చంద్రబాబు. భీమ్లానాయక్ సినిమా విషయంలోనూ పవన్ కు అండగా నిలిచారు. . తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలతో పొత్తు దిశగా అడుగులు ముందుకు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది.
పవన్ ప్రసంగం తర్వాత రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా సాగుతోంది. కొద్ది నెలల ముందే టీడీపీ.. జనసేన చీఫ్ ను సంప్రదించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతిస్తే మూడేళ్లు టీడీపీ వ్యక్తి, ముఖ్యమంత్రిగా, రెండేళ్లు పవన్ ముఖ్యమంత్రిగా ఉండే ప్రతిపాధన పవన్ ముందు పెట్టినట్లు సమాచారం.
అయితే మొదటి మూడేళ్లు టీడీపీ వాళ్లు తరువాత రెండేళ్లు జనసేన అభ్యర్ధి ముఖ్యమంత్రిగా ఉందామని టీడీపీ నుంచి ప్రతిపాదన రావడంతో పవన్ దానికి అంగీకరించలేదని సమాచారం.
మొదటి రెండేళ్లు జనసేన ఉంటుందని ఆయన ఖచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది. పొత్తుకు సంబంధించి చర్చలు దాదాపుగా కొలిక్కి రావడం వల్లే పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్బావ సభలో ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. బీజేపీ రూట్ మ్యాప్ విషయంలో కూడా పవన్ ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర పెద్దలు జగన్ తో సన్నిహితంగా ఉంటూనే రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయమంటే తన వల్ల కాదని ఆయన తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఈ విషయంలో బిజేపీ వైఖరిని బట్టి పవన్ కల్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ రెడీ చేసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు మాత్రం దాదాపుగా ఖారారైనట్లు తెలుస్తోంది.