ప్రశాంత్ కిషోర్… ప్రస్తుతం దేశంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్నికల వ్యూహ కర్తగా ఆయన సుపరిచితుడు. ఎన్నికల వ్యూహకర్తగా గెలిపించడంలో ఆయన ట్రాక్ రికార్డ్ సూపర్. గతంలో బీజేపీకి పని చేశారు. 2014లో ప్రధానమంత్రి మోడీకి ఆయనే వ్యూహకర్త. బీహార్ లో నితీశ్ కుమార్ ను గెలిపించారు. తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గెలిపిచడంలో ఆయన వ్యూహాలే ప్రధాన పాత్ర పోషించాయని అంటారు. 2019లో ఏపీలో వైసీపీకి అంతా తానై వ్యవహరించారు.
2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని అంటారు. ప్రస్తుతం కేసీఆర్తో కలిసి వర్క్ చేస్తున్నారు. పీకేతో 300 కోట్లకు కేసీఆర్ డీల్ కుదిరిందనే టాక్ అయితే ఉంది. అంత లేదంటూ సీఎం కేసీఆర్ పీకే ఫీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆయన రేట్ ఎంతో చెప్పేశారు. పనిలో పనిగా ప్రశాంత్ కిశోర్ను తెగ పొగిడేశారు.
ప్రశాంత్ కిశోర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు సీఎం కేసీఆర్. పీకేతో తనకు ఏడేళ్లుగా మంచి స్నేహం ఉందంటూ.. ఇది సీక్రెట్ అంటూ రివీల్ చేశారు. ఆయన యూఎన్వోలో పని చేశాడని.. ఇండియా తిరిగొచ్చాక దేశం కోసం పని చేస్తున్నాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంతకీ పీకేతో 300 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారటగా.. అని విలేకర్లు ప్రశ్నించగా కేసీఆర్ ఆసక్తికర విషయం చెప్పారు.
ఇంత వరకూ ప్రశాంత్ కిశోర్ ఎవరి దగ్గరా రూపాయి కూడా ఫీజు తీసుకోలేదని.. ఆయన డబ్బుల కోసం పని చేయరంటూ సంచలన విషయం వెల్లడించారు. ఎవరైనా ఆయన సాయం కోరితే.. ఉచితంగా వారి కోసం వర్క్ చేస్తారని.. అంతేగాని ఇన్నికోట్లు, అన్నికోట్లు అనేదంతా అవాస్తవమని.. పీకే చాలా మంచి మనిషంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.
దేశం కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. ఆయన పైసల కోసం పని చేస్తున్నట్లు మీ దగ్గర రిపోర్టు ఉందా? బీజేపీకి, జగన్కు, మమతకు పని చేసిండు. 12 రాష్ట్రాలతో పాటు దేశానికి పని చేసిండు.. దేశ రాజకీయాల మీద అవగాహన ఉంది కాబట్టి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి కిశోర్ను నేనే పిలిచాను. బ్రహ్మాండంగా పని చేస్తున్నాం. 100 శాతం ఆయన చిత్తశుద్దితో పని చేస్తున్నారు. ఆయన ఎన్నో దేశాల్లో పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.