వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వరుస ట్వీట్లతో విజయసాయిని తూర్పారబట్టారు బండ్ల గణేష్. ‘మీకు కులం నచ్చకపోతే, కమ్మవాళ్లు నచ్చలేదంటే నేరుగా తిట్టoడి. చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి’ అని సలహా ఇచ్చారు.
‘అయ్యా.. ఆంధ్రకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చకి.. నీ కుల పిచ్చకి.. నీ డబ్బు పిచ్చకి.. కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’ అంటూ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఫైరయ్యారు. నాకు వైఎస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవం.. కానీ, నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నావ్..? అని నిలదీశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ని చూసి నేర్చుకో’ అని విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ హితవు పలికారు.
అన్ని కులాల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లుంటారు సాయిరెడ్డి అని పేర్కొన్న గణేష్.. ‘చంద్రబాబుతో మీకేమైనా ఉంటే ఆయనతో తేల్చుకో.. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో.. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బలు రుచిచూపిస్తారు’ అని హెచ్చరించారు.
‘నీకు నచ్చకపోతే వ్యక్తి పేరు పెట్టి తిట్టు.. కానీ, కులాన్ని కాదు.. నిన్ను జైలు కు పంపింది కమ్మ వారు కాదు’ అన్నారు. ‘త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి.. ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో కూడా తెలుసు. అన్నింటికీ సిద్ధపడే ట్వీట్ చేస్తున్నాను అంటూ బండ్ల గణేష్ ట్విటర్లో ఊగిపోయారు.
‘కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రని నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు’ అని సాయిరెడ్డిని బండ్ల గణేష్ దయ్యబట్టారు . ఇదేనా నీ సంస్కారం? అని ప్రశ్నించారు. ‘నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు. ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు’ అంటూ గణేష్ మండిపడ్డారు.
‘పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు. అది నీకు మంచిది కాదు. టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారు?’ అని విజయసాయిరెడ్డిని బండ్ల గణేష్ నిలదీశారు. ‘కష్టాన్ని నమ్ముకున్న రైతులమని చెప్పారు. జగన్ తల్లీ, చెల్లికి దూరం కావడానికి విజయసాయే కారణమని ఆరోపించారు. విజయసాయి పిరికివాడిలో తనను బ్లాక్ చేసి స్క్రీన్ షాట్ను షేర్ చేసినట్లు గణేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.