మహానాడులో మొత్తం 17 అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఈమేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఏపీకి సంబంధించి 12 అంశాలు, తెలంగాణ కు సంబంధించి 3, అండమాన్ కు సంబంధించి ఓ అంశంపై తీర్మానాలు చేస్తారు. వీటితో పాటు రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది. మహానాడు ప్రతినిధుల సభ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. తీర్మానాలపై దాదాపు 50 మంది మాట్లాడే అవకాశం ఉంది. ఆయా తీర్మానాలు ప్రజల్లోకి వెళ్లేలా మహానాడు చర్చలు సాగాలని పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది.
వైసీపీ తలపెట్టిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ఓ నాటకమని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది. ఏ వర్గానికి ఏం చేశారని సామాజిక న్యాయమంటూ యాత్ర చేస్తారని నేతలు ప్రశ్నించారు. వైసీపీకి మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులుంటే అందులో నలుగురు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నట్లు తెలిపారు. 9 మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు బయట రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ముగ్గురు జగన్ తో పాటు కేసుల్లో ఉన్న వారేనని విమర్శించారు.
లాబీయింగ్ చేసేవారికి, కేసుల్లో సహ ముద్దాయిలకు జగన్ రాజ్యసభ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 12 బీసీ కులాలను జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం ఏరకంగా సమంజసమని ప్రశ్నించారు. మైనార్టీలకు రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుపడిన ఆర్ కృష్ణయ్య తప్ప ఏపీలో రాజ్యసభ ఇవ్వడానికి బీసీ నేతలే లేరా అని నిలదీశారు.
తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ఓ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లేరని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది. ఏవర్గానికి న్యాయం చెయ్యని వైసీపీకి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. యాత్ర చేసే నైతికత ఎక్కడ ఉంటుందని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
