రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7న కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈమేరకు తిరుమలలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలను పెద్ద ఎత్తున నిర్వహించినట్లు సుబ్బారెడ్డి గుర్తు చేశారు.
వైఎస్ మరణం అనంతరం కల్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ నిలిపేసినట్లు వైవీ తెలిపారు. మళ్లీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో కల్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. పేదల కుటుంబాల్లో పిల్లల వివాహాలు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నట్లు వైవీ పేర్కొన్నారు.
ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం.. శ్రావణ శుక్ల దశమి ఆదివారం.. ఉదయం 8.07 నుంచి 8.17 గంటల మధ్య.. అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు. అర్హులైన వారంతా ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపిస్తామని సుబ్బారెడ్డి వివరించారు.
Make a contribution to Encourage Independent Journalism
