మోడీ ప్రధానిగా కాకుండా సేల్స్మెన్గా పనిచేస్తున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా జలవిహార్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్డీయే పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు. మోడీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపినట్లు గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. మోడీ స్పందించకుంటే దోషిగానే చూడాల్సి వస్తుందన్నారు.
మోడీ ఎనిమిదేళ్ల పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. అవినీతిరహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారు.. ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోడీ పాలనలో అవినీతిపరులు పెరిగిపోయారన్నారు. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపయ్యింది. ఇదేనా వికాసం? అని ప్రశ్నించారు. మోడీ ప్రధానిగా కాదు..దోస్త్ కోసం షావుకార్గా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రధాని మోడీ దుర్వినియోగం చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. మోడీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. ఇక్కడ సరిపడా బొగ్గు నిల్వలున్నా..విదేశాల నుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని వెనక్కు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
మీ ప్రసంగమే కాదు.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
మీరు దేశం ముందు తలదించుకున్నారు. హైదరాబాద్ సమావేశంలో మీ ప్రసంగమే కాదు.. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. మోడీని చూసి పెద్దపెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శించారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ స్కాంలు జరిగాయన్నారు.
రూపాయి పతనం చూస్తే మోడీ పాలన ఏంటో అర్థమవుతోందన్నారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్దమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోడీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మోడీ విధానాలతోనే తమకు అభ్యంతరమని పేర్కొన్నారు. తాము మౌనంగా ఉండబోమని, పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఓ వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా : యశ్వంత్ సిన్హా
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచిదికాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు.
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్ కోసం కాదు. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటమిది’ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తనకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.