గుండెల్లో ఉప్పొంగే భావాలకు జీవం పోసేది మాతృ భాష. సృజనాత్మకతకు అక్షరాలు అందించగలిగేది అమ్మ భాషే. అలాంటి మన మాతృభాషను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎస్ఎన్ మూర్తి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా నాగపూర్ నుంచి ఆన్లైన్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా పీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూతెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో భాష నేర్చుకునే సౌకర్యం లేని తెలుగు పిల్లల్లో తెలుగు భాషను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులు, సభ్యులతో చర్చించారు. టీసీడబ్ల్యూఏ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ భవానీ సాధు సభ్యులందరికీ స్వాగతం పలికారు.
అనంతరం తెలుగు పాఠ్య పుస్తక ప్రచురణకర్త, తెలుగు కోర్సుకు చీఫ్ కోఆర్డినేటర్, మధ్యప్రదేశ్ అధ్యక్షుడు ఆర్వీఎస్ఎస్ శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని పరిచయం చేయడంలోని ఆదర్శాలను వివరించారు. ఇది తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్న పిల్లలకు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనమని తెలిపారు.
సమావేశంలో ఇంకా జీకే దొర (దోహా ఖతార్), బాసాబత్తిన శ్రీనివాసులు (టెక్సాస్), బీ కృష్ణారావు (ఒరిస్సా), గోపాల కృష్ణ (జార్ఖండ్) మహిళా విభాగం నుంచి ప్రభావతి వేదుల తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంకా, టీసీడబ్ల్యూ కోఆర్డినేటర్ పీటీ శర్మ ప్రపంచవ్యాప్తంగా తెలుగు తరగతుల పనితీరు గురించి నివేదించారు.