బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేయడం అధికార ప్రతిపక్షాలకు ఎప్పుడూ తలనొప్పులే. చివరిదాకా తేల్చరు. అప్పటిదాకా ఔత్సాహికులు ఉగ్గబట్టుకొని ఉండాల్సిందే. అధికార వైసీపీ అభ్యర్థి ఎవరనేది మళ్లీ దోబూచులాట మొదలైంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా రావి రామనాధంబాబు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. ఈ స్థానం కోసం ఒంగోలులోని ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ పోటీపడుతున్నారు.
గత ఎన్నికలకు ముందు రావి రామనాధంబాబు పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. నియోజకవర్గంలోని ప్రతీ కుటుంబంతో పరిచయం పెంచుకున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తానున్నానంటూ ఆపన్న హస్తం అందించేది. తీరా ఎన్నికలు దగ్గర పడేసరికి ఆయన్ని మార్చేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావును బరిలోకి దించారు. తనకు జరిగిన అన్యాయానికి నిరసనగా రామనాధంబాబు టీడీపీలో చేరారు. ఓడిపోయిన దగ్గుబాటి మొహం చాటేయడంతో మళ్లీ పార్టీకి రామనాధంబాబు అవసరం ఏర్పడింది.
రామనాధంబాబును పార్టీలోకి తీసుకొని డీసీఎంఎస్ చైర్మన్ పదవినిచ్చారు. అక్కడ నుంచి రామనాధంబాబు తిరిగి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తర్వాత పార్టీ పగ్గాలను రామనాధంబాబుకు అప్పగించి చైర్మన్ పదవిని ఆయన సతీమణికి ఇచ్చారు.
ప్రస్తుతం జగన్ నిర్దేశించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందంజలో కొనసాగిస్తున్నారు. సీఎం దగ్గర మంచి మార్కులే దక్కించుకున్నారు. ఈదఫా సీటు తనదేననే ధీమాతో రామనాధంబాబు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
మరోవైపు పర్చూరు స్థానాన్ని ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త కంది రవిశంకర్ ఆశిస్తున్నారు. ఇటీవల ఆయన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో వెళ్లి సీఎం జగన్ను కలిశారు. తనకు కచ్చితంగా సీటు దక్కుతుందనే ఆశతో ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఆయనకు పార్టీ కార్యక్రమాల బాధ్యతలు ఏవీ అప్పజెప్పినట్లు లేదు. సీఎం దగ్గర బాలినేని చక్రం తిప్పి కంది రవిశంకర్కు సీటు ఇప్పిస్తారా లేదా అనేది ఇప్పట్లో తేలేట్లు కనిపించడం లేదు.