“ ఏపీలో ఇవే ఆర్థిక పరిస్థితులుంటే సంక్షేమ పథకాలు కొనసాగించడం కష్టం. అనివార్యంగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముంది !” అంటూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈనెల ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పించన్లు ఇవ్వకపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాల అడుగులు కూడా ముందస్తు ఎన్నికలకేనన్నట్లు తెగ హడావుడి చేసేస్తున్నాయి.
ఈనెల 15 నుంచి పీకే బృందం నియోజకవర్గాల్లో తిష్ట వేస్తుంది. ప్రతీ రోజూ సీఎం జగన్కు నివేదిక అందిస్తుంది. ఈమేరకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల రోజువారీ పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారంటే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం తర్వాత ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.
నిత్యం ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ ఈపాటికే ఆదేశించారు. అలా ఉండని వాళ్లకు టిక్కెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ చరిష్మా వైసీపీ గెలుపునకు దోహదపడింది. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేలపైనే ఆధారపడి నెట్టుకు రావాలి.
మూడు రాజధానుల సెంటిమెంటే ప్రధానాస్త్రమా !
పెట్రోలు, వంట గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపుతో సగటు ప్రజల్లో తీవ్ర అసంతృప్తులు నెలకొన్నాయి. రవాణా, కరెంటు చార్జీలు మరింత భారమై జనం అల్లాడుతున్నారు. కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి వ్యాపారాలు మందగించాయి. కేవలం నిత్యావసరాల కొనుగోలుకే సామాన్యులు పరిమితమవుతున్నారు. ప్రజల ఆక్రోశం ప్రభుత్వంపై నెగటివ్ ప్రభావం చూపొచ్చు.
ఈ వ్యతిరేకతను దారి మళ్లించడానికి మూడు రాజధానుల సెంటిమెంటుపై దృష్టి సారించారు. అమరావతి రైతుల యాత్రకు పోటీగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వికేంద్రీకరణ జేఏసీని ఏర్పాటు చేస్తున్నారు. జేఏసీతో పోటీ యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. ఈ సెంటిమెంటే శ్రీరామరక్షగా వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
నియోజకవర్గాల సమీక్షలు.. అభ్యర్థుల ఖారారులో చంద్రబాబు బిజీ
మరోవైపు టీడీపీ శరవేగంగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఈపాటికే 108 నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెలు, ఇన్చార్జులే అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు సమాచారం. సమీక్ష సమయంలోనే ఇన్చార్జుల మార్పు చేర్పుల గురించి చర్చిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నెలకొన్న లుకలుకలు, బలం, బలహీనతలపై లోతుగా చర్చిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కర్తవ్యాలను నిర్దేశిస్తున్నారు. జనవరి 26 నుంచి నారా లోకేష్ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు.
తాజాగా రాష్ట్రంలోకి బీఆర్ఎస్ అడుగు పెడుతోంది. వైసీపీ, టీడీపీలో అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు పార్టీల్లోనూ కేసీఆర్ గుబులు రేకెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. సభల్లో ఏపీకి సంబంధించి కొన్ని అంశాలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాతనే ఏవైనా చేరికలకు అవకాశం ఉండొచ్చు. దీంతో ప్రధాన పక్షాల నుంచి ఎవరు పక్క చూపులు చూస్తున్నారనే అంశంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సీఎం జగన్ ముందస్తుకే మొగ్గు చూపొచ్చని అంచనా వేస్తున్నారు.