తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగలనుందా? రేవంత్ రెడ్డికి గులాబీ బాస్ దిమ్మతిరిగే ఝలక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు టీఆర్ఎస్ టచ్ లోకి వెళ్ళారనే వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ కార్యక్రమాలకు శ్రీధర్ బాబు దూరంగా ఉంటున్నారు. కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి సహకరించేలా ఆయన కాంగ్రెస్ పార్టీ ఓటర్లతో క్యాంపు నిర్వహించారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన వ్యవహారం కాంగ్రెస్ నుంచి ఆయన బయటికి వస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్, బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహాం హైదరాబాద్ మాదాపూర్ లో జరిగింది. ఈ పెళ్లికి తెలంగాణ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని ఫోటోలు సైతం తీసుకున్నారు. చాలా సేపు ఇద్దరూ కలిసే ఉన్నారు. దీంతో శ్రీధర్ బాబు కారెక్కడం ఖాయమనే చర్చ మొదలైంది.
గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు పాడి కౌశిక్ రెడ్డి పెళ్లి విందులోనే కేటీఆర్ టచ్ లోకి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీలో అంత కంఫర్టబుల్ గా లేరని చాలా కాలంగా వార్త లొస్తున్నాయి.
పీసీసీ పదవిని ఆశించి భంగ పడిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గారెడ్డి బయట పడినంతగా శ్రీధర్ బాబు బయట పడలేదు. అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. గతంలో కోమటి రెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క, జగ్గా రెడ్డి విషయంలో కూడా ఇలాగే పుకార్లు షికార్లు చేశాయి. శ్రీధర్ బాబు విషయంలో మాత్రం ఇవి కాస్త ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి ఏమైనా జరగొచ్చు సుమా !