సడెన్ గా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యనటకు వెళ్లారు. సీనియర్ ఆఫీసర్లను కూడా వెంట తీసుకెళ్లారు. అదే సమయంలో ఇక్కడ సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రులను హుటాహుటిన ఫాంహౌజ్ కు పిలిపించి చర్చించారు. దీంతో తెలంగాణలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ సంస్థపై ఐట్ రైడ్స్ జరిగాయి. దానికి.. కేసీఆర్ చేస్తున్న హడావుడికి లింక్ ఉందనే చర్చ జరుగుతోంది.
కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్పై ఐటీ రైడ్స్ అనేక డొంకలను కదిలించిందని అంటున్నారు. ఆ ఐటీ సోదాల్లో భారీ నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు దొరికాయని తెలుస్తోంది. ఆ పత్రాల్లో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా మంత్రి కేటీఆర్ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తోందని.. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారుల లింకులూ వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్న ఐటీ శాఖ.. త్వరలోనే పలు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలంగాణలో కాళేశ్వరంతో సహా పలు ప్రాజెక్టులకు ప్యాకేజీ పనులు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రధాన కాంట్రాక్టర్ అయిన మేఘా సంస్థ.. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి రజిత్ కుమార్ కూతురు వెడ్డింగ్ ఈవెంట్ ఖర్చు అంతా భరించిందనే ఆరోపణలున్నాయి. ఫలక్నుమా ప్యాలెస్లో జరిగిన ఆ వివాహ విందుకు మేఘా సంస్థకు చెందిన కంపెనీలు భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాయని మీడియా కోడై కూసింది.
ఆ మేరకు రజిత్ కుమార్ మీద ఇప్పటికే డీవోపీటీకి ఫిర్యాదు కూడా అందింది. ఆ ఫిర్యాదును పరిశీలించి, ఎంక్వైరీ చేయాలంటూ సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించింది డీవోపీటీ. ఇక లేటెస్ట్గా ఫాంహౌజ్లో కేసీఆర్ జరిపిన అత్యవసర సమావేశంలో.. రజిత్ కుమార్పై వచ్చిన ఫిర్యాదు గురించి సీఎస్ను ముఖ్యమంత్రి ఆరా తీసినట్టు సమాచారం.
రజిత్ కుమార్ అనే కాదు.. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థలో జరిగిన ఐటీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్లో.. ఐఏఎస్లు సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్ల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. వీరంతా బీహార్ అధికారులే కావడం.. ఇందులో అరవింద్ కుమార్, జయేశ్ రంజన్లు కేటీఆర్తో బాగా క్లోజ్గా ఉండే ఆఫీసర్లు కావడం ఆసక్తికరం. ఈ ఐటీ దాడులు.. త్వరలోనే ఈడీ అటాక్స్కు దారి చూపించబోతున్నాయనే ప్రచారం ఆయా వర్గాలను షేక్ చేస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ నడవడం వెనుక బీజేపీ కేంద్ర పెద్దల హస్తం ఉందనే అనుమానాలూ రేకెత్తిస్తున్నాయి.