నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 49.6 శాతం రైతులకే బ్యాంకుల నుంచి సంస్థాగత రుణాలు అందుతున్నాయి. వ్యవసాయం చేసే సగం మంది అన్నదాతలకు బ్యాంకు పరపతి మృగ్యం. ఇచ్చామంటున్న రుణాలన్నీ ఎక్కువ రెన్యువల్సే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అప్రస్తుతమై పోయింది. సంస్థాగత పరపతిలో వాణిజ్య బ్యాంకుల నుంది అందుతున్నది 34.1 శాతం మాత్రమే. దేశానికి అన్నం పెట్టే రైతులకు బ్యాంకులు పెట్టుబడులు సమకూర్చకపోతే పెట్టుబడి ఎలా ! అనివార్యంగా వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో కూరుకుపోతున్నారు.
ఈ విషయాన్నే సర్వే కుండ బద్దలు కొట్టింది. వడ్డీ వ్యాపారుల నుంచి 31.1 శాతం మంది, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి 15.4 శాతం మంది అప్పు చేసి పంటలు సాగు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులంటే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను విక్రయించే వ్యాపారులు. వడ్డీపై ఉత్పాదకాలను రైతులకు అందించి వడ్డీ వేసుకుంటారు. పంటలు అమ్మగానే ముందు వారికే బకాయిలు చెల్లించాలి. గ్రామాల్లో ఈ పద్ధతి వ్యవస్థీకృతం అయినందు వల్లనే వైసీపీ సర్కారు ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల వైపు రైతులు కన్నెత్తి చూడట్లేదు.
సాధారణ వడ్డీ వ్యాపారులంటే అచ్చంగా చేతికి నగదు బదులిచ్చే బాపతు. వీరి వడ్డీ చాలా అధికంగా ఉంటుంది. నూటికి రూ.5-10 వసూలు చేస్తారు. రైతులకు సంస్థాగత పరపతి అందని కారణంగానే గ్రామాల్లో వడ్డీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ సంస్థలు సైతం రైతులనే లక్ష్యంగా చేసుకొని అధిక వడ్డీలకు రుణాలిస్తున్నాయి. సర్వేలోనే మరో కీలక అంశం ఉంది. రైతులు చేస్తున్న అప్పుల్లో 60.3 శాతం కేవలం సాగుకే వెచ్చిస్తున్నారు.
మిగతా రుణాలను గృహ నిర్మాణం, విద్య, వైద్యం, వివాహాలు, శుభ కార్యాలు, ఇతరత్రా వ్యాపకాలకు వ్యయం చేస్తున్నారు. రైతు అప్పులంటే సాధా రణంగా వచ్చే చర్చ ఏమంటే.. వారు సేద్యం కోసం చేసే ఖర్చులనే ఆ కోవలో వేస్తారు. ప్రభుత్వం సైతం అదే చెబుతుంది. రైతులూ మామూలు మనుషులే. సమాజంలో బతికే వారికి వచ్చే అవసరాలన్నీ వారికీ ఉంటాయి. రైతు అప్పులను సేద్యానికి కాకుండా ఆస్పత్రి, పిల్లల చదువులకు వాడకూడదనడం రైతుల పట్ల ఒక విధమైన వ్యతిరేకతను నూరి పోయడమే.
జాతీయ గణాంకాల లెక్క ప్రకారం ఏపీ రైతు ఆదాయం రోజుకు రూ.277 మాత్రమే. ఇది ఉపాధి హామీ కూలీకి దక్కే వేతనంతో సమానం. ఇంత తక్కువ ఆదాయం రావడానికి ప్రభుత్వ విధానాలే కారణం. సంస్థాగత రుణ పరపతి తగ్గిపోవడం. వ్యవసాయ ఉత్పాదకాల ధరలు పెరగడం. పంటలకు గిట్టుబాటు ధరల్లేమి. విపత్తుల సమయంలో పంటల బీమా వంటి సదుపాయాలు దరి చేరకపోవడం. ఈ నాలుగు అంశాలపై స్వామినాథన్, జయతీ ఘోష్, కోనేరు రంగారావు, రాధాకృష్ణ కమిషన్లు అధ్యయనం చేసి సిఫారసులు చేశాయి.
ఆ కమిషన్లను ప్రభుత్వాలే వేసినా అవి ఇచ్చిన సూచనలను మాత్రం బుట్టదాఖలు చేశాయి. ఏపీలోనే రైతుల రుణ కుటుంబాలు దేశంలోకెల్ల గరిష్ట స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం కౌలు వ్యవసాయం. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులున్నారని 2015లో రాధాకృష్ణ కమిషన్ పేర్కొంది. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు సంస్థాగత పరపతి, ఇతర ప్రభుత్వ పథకాలను విధిగా వర్తింపజేయాలని సూచించింది. అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. రైతులను రుణ విముక్తుల్ని చేసేది ఇంకెన్నడు !
✍️ కేఎస్వీ ప్రసాద్, ఏపీ రైతు సంఘం, మొబైల్ : 9490099019