గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఓ విప్లవాత్మక చర్యగా ప్రతీ ఒక్కరూ హర్షిస్తున్నారు. అదే ఆర్బీకేల్లో వాస్తవ సాగుదారుల నమోదు ప్రక్రియ కూడా రికార్డు చేయాలి. ఆర్బీకేలతో ఎలాగూ బ్యాంకింగ్ సేవలను అనుసంధానించారు. మరి అలాంటప్పుడు కౌలు రైతులకు పంట రుణాలు ఎందుకు ఇవ్వరు ! విత్తనం దగ్గర నుంచి తిరిగి పంట కొనుగోలు దాకా ఆర్బీకే కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు వాస్తవ సాగు దారులను గుర్తించి పంట రుణాలు ఇప్పిస్తే రాష్ట్రంలో వ్యవసాయం తీరే మారిపోతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతానికి పైగా కౌలు సాగు నడుస్తోంది. కనీసం ఒక్క శాతం రైతులు కూడా కౌలుదారులుగా నమోదు కావడం లేదు. దీంతో వాళ్లు సంస్థాగత రుణ పరపతికి దూరమవుతున్నారు. ఎరువుల డీలరో, రైస్ మిల్లరు.. కాకుంటే వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి పెట్టుబడి సమకూర్చుకోవాల్సి వస్తోంది. చివరకు వడ్డీకిచ్చిన దళారీ అడిగిన ధరకు పంటను తెగనమ్ముకునే దురవస్థ నెలకొంది. ఈ నిలువు దోపిడీ విధానాన్ని బద్దలు కొట్టకుంటే ఆర్బీకేల పాత్ర నామమాత్రమే అవుతుంది. ఆర్బీకేలతో అనుసంధానమైన బ్యాంకింగ్ సేవలు భూ యజమానుల వరకే పరిమితమవుతాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలున్నాయి. ప్రస్తుతం 9,160 ఆర్బీకేల పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం 6,708 మంది మాత్రమే ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారు. వీళ్లంతా ఆయా బ్యాంకులకు సంబంధించి కేవలం రూ.25 వేల లోపు విత్ డ్రాలు, కొత్త ఖాతాలు తెరవడం, డిపాజిట్ల సేకరణ, రుణాల రికవరీ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. త్వరలో ఆర్బీకేల పరిధిలో ఏటీఎం సెంటర్లు కూడా నెలకొల్పాలని భావిస్తున్నాయి. కేవలం ఈ అరకొర చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు రావు.
ఈ –క్రాప్ లో పక్కాగా పంట సాగుదారుల పేర్లు మాత్రమే నమోదు చేయాలి. పంట రుణాలను సాగుదార్లకు మాత్రమే ఇప్పించాలి. విత్తనం దగ్గర నుంచి పంట నూర్పిడి దాకా అవసరమైన పెట్టుబడిని ఆర్బీకేల సహకారంతో బ్యాంకులు అందించాలి. తిరిగి ఆర్బీకేలే పంట ఉత్పత్తులను సేకరిస్తుంది కాబట్టి రుణాన్ని తేలిగ్గా వసూలు చేయొచ్చు. ఇప్పుడు దళారీ వ్యవస్థ పోషిస్తున్న పాత్ర స్థానంలో ఆర్బీకేలు, బ్యాంకులుంటే గ్రామీణ ప్రజల జీవన స్థితిగతుల్లో గణనీయమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఆ దిశగా అడుగులు వేసేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టిసారించాలి.