పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంకు శాసనసభలో సవరణలు చేయలేరని, ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పిందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను కూడా కొట్టేయగల అధికారం న్యాయస్థానాలకు ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో రాజ్యాంగాన్ని, చట్ట సభలను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రాజ్యాంగ సంస్థలను అపహాస్యం చేయరాదన్నారు.
ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కోరారు.. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అనేక సార్లు చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోమారు స్పష్టం చేసిందన్నారు.
చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ, ఆర్టీఓ అధికారులు పరిశీలించారు. ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో అధికారులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ వద్ద లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కడప ఎయిర్పోర్టు నుంచి మళ్లీ విమానాలు ఎగురుతున్నాయి. విజయవాడ-కడప విమాన సర్వీసును ప్రారంభించారు. వారంలో 4 రోజులు ఇండిగో సంస్థ విమానం నడపనుంది. ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో ఇండిగో విమాన సర్వీసులు నడుస్తాయి. విజయవాడ నుంచి ఉదయం 11:45 గంటలకు విమాన సర్వీసు నడుపుతారు. కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నైతో పాటు తొలిసారిగా విశాఖపట్నం, బెంగళూరుకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఉడాన్ పథకంలో భాగంగా ట్రూజెట్ సంస్థ కడప నుంచి విమానాలను నడిపేది. అయితే పథకం గడువు ముగియడంతో హైదరాబాద్, చెన్నై, విజయవాడ సర్వీసులు నిలిచిపోయాయి.