ఏపీలో వృద్ధాప్య పింఛన్ల కోసం ఓ అవ్వ కోర్టు కెక్కి విజయం సాధించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన 65 ఏళ్ల కాకర్ల సరోజనమ్మ 2019 నుంచి పింఛను అందుకుంటోంది. ఏవో కారణాలు చూపుతూ.. ఏవేవో కొర్రీలు వేస్తూ అధికారులు సరోజనమ్మ పింఛను ఆపేశారు. పింఛను కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టు తిరిగినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆమె కోర్టుకెక్కింది. ఆమె బాధను, అవసరాన్ని గుర్తించిన కోర్టు సరోజనమ్మకు వెంటనే పింఛను పునరుద్ధరించాలని ఆదేశించింది. ఎప్పటి నుంచి ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కగట్టి చెల్లించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జనవరి 2020 నుంచి ఆమెకు పింఛను రావడం ఆగిపోయింది. దీంతో అధికారులను కలిసి ప్రశ్నిస్తే.. 24 ఎకరాల పొలం ఉండడంతోనే పింఛను ఆపేసినట్టు చెప్పారు. తనకున్నది 4.90 ఎకరాల మెట్ట భూమి మాత్రమేనని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక లాభం లేదని గతేడాది అక్టోబరులో సరోజనమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో సరోజనమ్మ పింఛను పునరుద్ధరించాలని ఆదేశించింది. ఆగిన కాలానికి సంబంధించి మొత్తాన్ని లెక్కగట్టి అది కూడా చెల్లించాలని సూచించింది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు గత నెలలో సరోజనమ్మ పింఛన్ని పునరుద్ధరించారు. ఆగిన 22 నెలల కాలానికి సంబంధించిన పింఛను సొమ్ము మాత్రం చెల్లించలేదు. దీంతో సరోజనమ్మ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆఘమేఘాలపై 22 నెలల పింఛను మొత్తం రూ.47,250లను సరోజనమ్మకు అందించారు.