జిల్లాల విభజన ఆంధ్రప్రదేశ్ లో కొత్త వివాదాలకు కారణమవుతోంది. చాలా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బోలెడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తే.. ఇంకొందరు తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి కోరుతున్నారు. జిల్లాల పేర్లపై మండిపడుతూ నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా జిల్లాల విభజన సెగ మెగా బ్రదర్స్ను తాకింది. వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
విజయవాడ జిల్లాకు ఎన్టీ రామారావు జిల్లాగా ఖరారు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారుతోంది. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న కాపు నేతలు.. ఈ అంశంలోకి చిరంజీవి, పవన్ కల్యాణ్ ను లాగారు. రంగా రీ ఆర్గనైజేషన్ పేరిట విశాఖలోని ఓ హోటల్లో కాపు నేతలు సమావేశమయ్యారు.
విజయవాడ కు వంగవీటి రంగా పేరు పెట్టాలని సీఎం జగన్ ని కోరుకుతున్నామని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మెగా బ్రదర్శ్ కు లింకు పెట్టారు కాపు నేతలు. వంగవీటి రంగా పేరును విజయవాడకు పెట్టాలనే డిమాండ్ పై మెగా స్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని కాపు నేతలు కోరారు.
బెజయవాడ ప్రజలకు వంగవీటి రంగా ఎనలేని సేవలు చేశారని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. అందుకే ఆయన పేరు పెట్టడమే సరైంది అంటున్నారు. ఎన్టీఆర్ గుడివాడలో పుట్టారు. అది మచిలీపట్నం జిల్లా. కనుక విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టడం సరైన నిర్ణయమని పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా ఈ విషయం పై స్పందించాలని కోరారు.
గుడివాడలో పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కోసం దీక్ష చేపట్టి రంగా చనిపోయారని.. విజయవాడ ప్రజలకు వంగవీటి రంగా ఎనలేని సేవలు చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం కచ్చితంగా విజయవాడకు రంగా పేరు పెట్టి తీరాలన్నారు. చాలా మంది రంగా పేరు వాడుకుంటున్నారు తప్ప దీనిపై ఎవరు మాట్లాడం లేదన్నారు. చిరంజీవి సీఎం జగన్ దగ్గరకి వెళ్లి కేవలం సినిమా విషయమే కాకుండా ఈ విషయం పై మాట్లాడాలని సూచించారు కాపు నేతలు.
ఇతర కాపునేతలకు ఈ డిమాండ్ తో వచ్చిన నష్టం పెద్దగా ఉండదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్ చేయడం కష్టమే. కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అయినా.. సినిమా ఇండస్ట్రీలో బలమైన వ్యక్తులు. అదే ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఆరాధ్య దైవం. కాబట్టి ఎన్టీఆర్ పేరు తొలగించి రంగా పేరు పెట్టాలని వారు డిమాండ్ చేయడం కష్టమే. మరీ మెగా బ్రదర్స్ విషయంలో కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.