ఊపిరి సలపని ఆర్థిక ఒడిదుడుకులతో ప్రభుత్వం రోజుకో పిల్లిమొగ్గ వేస్తోంది. తాజాగా రియల్ ఎస్టేట్ వెంచర్స్లో 5శాతం ప్లాట్లను ప్రభుత్వానికి కేటాయించాలని ఆదేశించింది. వెంచర్లో సాధ్యం కాకుంటే మూడు కిలోమీటర్ల లోపు భూమిని కొనివ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. అదీకాకుంటే విలువకు సమానమైన సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల ఎకరానికి రూ.7.25 లక్షల అదనపు భారం పడుతుందని వ్యాపారులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఏటా సుమారు 3వేల ఎకరాల్లో వెంచర్లకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈలెక్కన కొనుగోలుదార్లపై రూ. 217 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అసలు అమ్ముడుపోతేనే కొనుగోలుదార్లకు భారమైనా.. సర్కారుకు రాబడయినా వచ్చేది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఒనగూడేదేమీ లేదని కొందరు పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.
రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఇచ్చే అవకాశముంది. దాంతో పెద్ద ఎత్తున ప్లాట్లు కొనుగోలు చేస్తారు. తద్వారా కొంత ఖజానా పూడ్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనూ కొంత ఆశలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎడాపెడా వెంచర్లు వేయడమేగానీ క్రయవిక్రయాల్లేవు. బ్యాంకులతో రుణం ఇప్పిస్తామని ముందుకొచ్చినా కొనుగోళ్లు ఆశాజనకంగా లేవు. మరోవైపు ఉద్యోగుల స్థితిగతులు అంతబాగా లేవు. గత ప్రభుత్వంలో మాదిరిగా అమ్యామ్యాల ఆదాయం బాగా తగ్గిపోయింది. ఏ శాఖలోనూ రూపాయి లేదు. పనుల్లేవు. పని చేయమని వచ్చి అడిగే నాధుడు లేడు. చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు గోళ్లు గిల్లుకుంటున్నారు. దీంతో అనివార్యంగా ఇల్లు, కారు, ఇతర గృహోపకరణాలకు కట్టాల్సిన వాయిదాల చెల్లింపునకే ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ బకాయిలు, పీఆర్సీ ఇచ్చినా ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనే పరిస్థితి ఉండదు. అప్పులు తీర్చుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో సంపన్నశ్రేణి నుంచి ప్లాట్ల కొనుగోలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. కేవలం వైద్యులు, మందుల దుకాణాలు, ఆస్పత్రుల యాజమాన్యాలకు తప్ప ఇబ్బడిముబ్బడిగా ఎవరికీ ఆదాయం లేదు. మధ్యతరగతి ప్రజలు అప్పుల్లో మునిగి తేలుతున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత దిగువ మధ్య తరగతి జనం పేదరికంలోకి జారిపోయారు. పేదలకు ఎలాగూ ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తోంది. ఇక ఎటువైపు నుంచీ కొనుగోలు దార్లు పెరిగే సూచనలు కనిపించడం లేదు. అందువల్ల ఈపాటికే పడకేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ధరల పెంపుతో మరింత కుదేలవుతుంది. ప్లాట్లు అమ్ముడుపోతుంటే కొత్త వెంచర్లు వస్తాయి. అసలుకు అసలే మూలనపడితే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరకపోవచ్చు.
ఇవే పరిణామాలు ఉత్పన్నమైతే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయి పొరుగునున్న హైదరాబాద్కు పెట్టుబడులు తరలిపోయే అవకాశాలున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఎక్కడ ఉంటే పెట్టుబడులు కూడా అక్కడికే తరలిపోతాయి. దీంతో హైదరాబాద్ శివార్లలో ఈపాటికే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన బడా కంపెనీలకు గిరాకీ తగిలినట్లే. అక్కడ ప్లాట్లకు డిమాండ్ పెరుగుతుంది. అక్కడ భూమి విలువ పెరుగుతుంది. మరిన్ని వెంచర్లు వెలుస్తాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. పొరుగు రాష్ట్రంలో కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.