దక్షిణాఫ్రికా నుంచి అదానీ బొగ్గును తాము కొనుగోలు చేయలేమని రెండు తెలుగు రాష్ట్రాలు నిరాకరించాయి. దిగుమతి చేసుకోవాల్సిందేనని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. తెలంగాణ సర్కారు ససేమిరా అంటోంది. మరి సీఎం జగన్ను ప్రధాని మోడీ అడిగితే జగన్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది. సీఎం జగన్ గురువారం ఢిల్లీలో ప్రధానితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో బొగ్గు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది.
సింగరేణిలో తమకు టన్ను రూ.3 వేలకు వస్తుంటే.. అదానీ బొగ్గు గనుల నుంచి రూ.30 వేలకు కొనుగోలు చేయాల్సిన ఖర్మ మాకేంటని తెలంగాణ సర్కారు నిర్దంద్వంగా తిరస్కరించింది. దీనిపై కేంద్రం గుర్రుగా ఉంది. సామదాన దండోపాయాలను ప్రయోగించి అదానీ బొగ్గుకు డిమాండ్ క్రియేట్ చేసేందుకు కేంద్ర సర్కారు ఆపసోపాలు పడుతోంది.
ఏపీలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సుమారు 30 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతోంది. ఈ ఏడాది జనవరిలో ఏపీ పవర్ డెవలప్మెంటు కార్పొరేషన్ కోల్ బిడ్లను ఆహ్వానించింది. అదానీ కంపెనీ టన్ను రూ. 40 వేల చొప్పున 5 లక్షల టన్నులు, అగర్వాల్ కోల్ కంపెనీ రూ.17,480 ధరతో 7.5 లక్షల టన్నులు సరఫరా చేస్తామని బిడ్లు వేశాయి. ఈ ధరలు చూసి అధికారులు షాకయ్యారు. ఈ రెండింటి నుంచి తాము బొగ్గు తీసుకోలేమని బిడ్లను రద్దు చేశారు.
ఈపాటికే ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సుమారు 1.12 లక్షల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఒకటికి పది రెట్లు అదనంగా ధర చెల్లించి అదానీ బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ కేంద్రం ఒత్తిడితో అంత ధర పెట్టి బొగ్గు కొనుగోలు చేస్తే తర్వాత ఆ భారమంతా విద్యుత్ వినియోగదార్లపై పడుతుంది. ఈపాటికే పెంచిన విద్యుత్ చార్జీల దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం మళ్లీ చార్జీలు పెంచే సాహసం చేస్తుందా ! మరి ప్రధాని అదానీ బొగ్గు కొనాలంటే సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
![](https://telugillu.com/wp-content/uploads/2022/05/idmf-7.jpeg)